బీజేపీపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే కవిత అరెస్ట్ కావాలి: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

  • రాష్ట్రంలో బీజేపీ స్పీడ్ సరిపోవడం లేదన్న విశ్వేశ్వర్‌రెడ్డి
  • కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్య
  • ఢిల్లీ మద్యం కేసు నెమ్మదించడంపై ప్రజల్లో అనుమానాలున్నాయన్న మాజీ ఎంపీ
బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఢిల్లీలో ఏదో అవగాహన కుదరిందన్న ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీపై తిరిగి ప్రజల్లో విశ్వాసం నెలకొనాలంటే ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ కావాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఐదు నెలల సమయం మాత్రమే ఉందన్న ఆయన.. రాష్ట్రంలో బీజేపీ స్పీడ్ సరిపోవడం లేదన్నారు. ఢిల్లీలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, ఆయన కుటుంబాన్ని దెబ్బతీసే పార్టీ బీజేపీయేనని తొలుత నమ్మిన ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు ఖాయమని అందరూ అనుకున్నారని, తమ పార్టీ నేతలు కూడా దీనిపై ఉపన్యాసాలు ఇచ్చారని విశ్వేశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే, ఇప్పుడీ కేసు నెమ్మదించడంతో ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయని అన్నారు. కవిత జైలుకు వెళ్లకుంటే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని ప్రజలు ఆరోపిస్తారని ఆయన అన్నారు.

Konda Vishweshwar Reddy
BJP
K Kavitha
BRS

More Telugu News